1, జులై 2012, ఆదివారం

కరపత్రము - 2


    చరిత్ర తెలియక విస్మృతికిలోనైన అమాయక అ.క్ష.లు తమ కులం పేరును పల్లెకారి అని చెప్తూ అది పల్లవ పదమునకు రూపాంతరమని వాదిస్తుంటారు. కాని పల్లవ అను పదమునకు పల్లెకారి అను పదమునకు పోలికే లేదు. ఈ పల్లెకారీనే పదము ఎట్లా ఏర్పడినదో ఎక్కడా చారిత్రకమైన ఆధారములు కనపడవు. కొందరు పళ్ళి అను పదమునకు మళయాళ భాషలోని రాజు అనే అర్థం తీసుకొని పల్లవులు రాజులు కనుక పల్లీలు అని పిలువబడినారు అంటారు. మళయాళంలోని పళ్ళి అంటే రాజు అన్న అర్థం పరిగణనలోకి తీసుకుంటే ఆ కాలంలో రాజ్యాలేలిన రాజవంశీకులందరూ పల్లీలు అని పిలువబడి ఉండాలి. కాని అది ఒక్క పల్లవ రాజ వంశీకులకే ఆపాదించబడింది. పైగా మళయాళ దేశమునేలిన కేరళులు అతి ప్రాచీనకాలమునుండియు పల్లవుల వలెనే స్వతంత్ర రాజులు. ఆ రెండు రాజవంశములు సమకాలీన వంశములు. మళయాళ భాషలోని పళ్ళి అను పదము పల్లిగా మారినదను వాదమును అంగీకరించుటకు పల్లవుల పాలన కాలంలో కేరళీయులకు, పల్లవులకుగల రాజకీయ సంబంధముగురించికాని, సామాజిక సంబంధ బాంధవ్యాల గురించిగాని, ఎక్కడో నైరుతి తీర ప్రాంతవాసులైన కేరళీయులు తూర్పుతీర ప్రాంతమునకు వలస వచ్చినట్లుగాగాని చారిత్రక ఆధారాలు కనిపించవు. అదే చాళుక్య, చోళ మైత్రి ఫలింతంగా ఆంధ్ర, తమిళ దేశాల మధ్య సంబంధబాంధవ్యాలు హెచ్చుగానే వుండేవని చారిత్రక ఆధారాలు కనిపించుచున్నవి. తెలుగు, తమిళ భాషలు ఒకే కూటమికి చెందినవి. రెండు భాషలలో కొన్ని అక్షరాల సామ్యము కూడ కనిపిస్తుంది. మళయాళంలోని పళ్ళి అను పదము పల్లి గా తీసుకుంటే మరి పల్లెకారి లేక పల్లికారి అనే పదము ఎట్లా ఏర్పడినదో అందులోని కారి అను అక్షరములు ఎందుకు కలిపారో, కారి అంటే అర్థమేమిటో ఎక్కడా వివరణ కనబడదు. ఒకవేళ విదేశీయులు కొన్ని నగరాలు, పట్టణాలు పేర్లు ఉచ్ఛారణను మార్చి వేరే వింధంగా అనగా... ఘంటసాల ను కొంటకొస్సలగాను, బందరు దగ్గర గూడూరుని కొడ్డూర అనియు, మోటుపల్లిని మోసలపురం అనియు పలికినట్లు పల్లెకారి అని వుంటారని చెప్పుటకు కూడా తగిన ఆధారాలు లేవు. దానికి మూలపదమేమిటో తెలియదు.
    ఈ పల్లెకారి అనే పదమే అ.క్ష.లకు సమాజంలో సరియైన విలువలు లేకుండా పోవడానికిగల ప్రధాన కారణం. పల్లెకారి అనగానే చేపలు పట్టుకునేవాడుగా చూడబడతాడు. అ.క్ష.లు ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయంగాను ఎంత ఉన్నత స్థాయికి ఎదిగిన వారైనా ఈ పల్లెకారి అను పేరువల్ల సమాజంలో ఇతర బడుగు, బలహీన కులాలు, ఎటువంటి చారిత్రక నేపథ్యములేని కులాల వారికంటేకూడ చిన్నచూపు చూడబడతారు. కనుక అ.క్ష.లు తమను తాము కించపరుచుకొనే పల్లి అనిగాని పల్లెకారి అనిగాని చెప్పుకోవడంగాని, పిలిపించుకోవడంగాని సరైనది కాదు. ప్రభుత్వ ఉత్తర్వులలో కనిపించు పల్లి అను పేరు బెస్త, జాలరి, వాడబలిజ మొదలగు అనేక ఉపకులాల వలెనే ఒక ఉపకులమే అవుతుంది గాని అ.క్ష. కులమునకు మాత్రము పర్యాయపదంగా వర్తించదు.
    కనుక అ.క్ష. సోదర మహాశయులు తమ కులము పేరు చెప్పవలసినచోట పల్లెకారి అని కాకుండా అగ్నికుల క్షత్రియ అని చెప్పవలసినదిగా మనవి.


1. అగ్నికుల క్షత్రియులు మత్స్యకారులా?
    కానే కాదు. కుల విభజనకు, కుల వౄత్తుల ఏర్పాటుకు మూలాధారంగా భావింపబడుచున్న అతి ప్రాచీన గ్రంథమైన మనుధర్మ శాస్త్రము 10 వ అ. 48 శ్లోకంలో మత్స్యఘాతో నిషాదానాం... నిషాదులకు చేపలు పట్టుట వృత్తి... అని చెప్పబడి ఉన్నది. అంతేకాని అది ఏ కులానికీ కుల వృత్తిగా ఆపాదింపబడలేదు.
    అ.క్ష.లుగాక ఏ ఇతర కులాన్ని పరిశీలించినా సమాజానికి అవసరమైన వస్తువుల ఉత్పత్తిగాని, సేవా వృత్తులలో ఏదో ఒక వృత్తిలోగాని స్థిరపడి అందులోనే నిష్ణాతులై దానినే వారి వంశపరంపర కులవృత్తిగా చేసుకున్నారు. అటువంటి ఏ కులవృత్తికైనా ఆ కులములోని వారే అర్హులుగాని ఇతరులెవరూ ప్రవేశార్హులుకారు. ప్రాచీనకాలమునుండి వంశపరంపరకు సంబందములేని బహువృత్తినిపుణులు కలిగిన కులము అగ్నికుల క్షత్రియ కులము ఒక్కటే కనిపిస్తుంది. అందులో ప్రధానమైన వృత్తులు వ్యవసాయం, నౌకానిర్మాణం, నౌకాయానము... వాటికి అనుబంధమైన వడ్రంగము, కమ్మరము మొదలగు వృత్తులలో నిపుణులైనవారు అ.క్ష.లలో ఎందరో ఉన్నారు. వీటిలో నౌకానిర్మాణము, దానికి సంబంధించిన వడ్రంగం, నౌకాయానము అ.క్ష.లకే ప్రత్యేకము. ఏకొద్దిమందో పై వృత్తులనేర్పరచుకునే ఆర్థికస్థోమత లేని వారు, నిరక్షరాస్యులు వారి జీవనభౄతికొరకు మత్స్యకార వృత్తిని చేపట్టి ఉండవచ్చు. అంతమాత్రంచేత అ.క్ష.లందరూ వారు ఏ వృత్తిలో ఉన్నా మత్స్యకారులేనని, మత్స్యకారులందరూ అ.క్ష.లేననడం మాత్రము సహించరానిది. అట్లా అనినవారికి తగు విధంగా గుణపాఠం చెప్పాలి. మత్స్యకార వృత్తి అ.క్ష. కులమునకు కులవృత్తి కాదు. ఈ మత్స్యపరిశ్రమలో కొన్ని అగ్రకులాల వారితో సహా అనేక కులాలవారు, వారి కులవృత్తికి అనుబంధంగా ఈ వృత్తిని చేపట్టిన వారు ఉన్నారు. వారిని మత్స్యకారులు అనరు. ఆ వృత్తితో ఏ కాలంలోనూ, ఏటువంటి సంబంధము లేకుండా ఇతర వృత్తులలో, ఉద్యోగాలలో స్థిరపడి పట్టణాల్లో, నగరాల్లో, విదేశాల్లో నివసించుచూ ఆర్థికాభివౄద్ధి సాధించి గౌరవప్రదంగా జీవించుచున్న అ.క్ష.లు అధికశాతంలో ఉన్నారు. కులం పేరు పల్లెకారి అని చెప్పడంలో అ.క్ష.లు అధికసంఖ్యలో ఆత్మన్యూనతకు లోనై కులం పేరును మార్చుకునో, ఇంటిపేరుని వీలైన చోటల్లా మార్చుకునో వేరే కులస్తులుగా పరిగణనలోకి వస్తున్నారు. దానివల్ల కుల అస్తిత్వానికే భంగము వాటిల్లే ప్రమాదముంది.
    కనుక అ.క్ష. సోదరులందరూ పై వివరణ దౄష్ట్యా దయచేసి కులమునకుగల పల్లి, పల్లికారి అను పేరును వీడి ఇకముందు కులం పేరును చెప్పవలసినచోటల్లా `అగ్నికుల క్షత్రియా అని చెప్పుకొని, అదే పేరుతో చలామణిలోకి వచ్చి కులమునకు పూర్వవైభవమును పునరుద్ధరించుకొనుటకు కృషి చేపట్టవలసినదిగా మనవి.
    దీనివల్ల అ.క్ష.ల సామాజిక గుర్తింపు ఏ కొంచెము మార్పు అయినా సంభవించి వారు ఆత్మన్యూనతనుండి బయటపడవచ్చునేమోగాని వారు చేసే వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలోగాని, వారి ఆర్థికస్థితిలోగాని అకస్మాత్తుగా ఏటువంటి మార్పుకు ఆస్కారము లేదు. కనుక ప్రస్తుతం ప్రభుత్వం నిరుపేదల అభివృద్ధికి కల్పించుచున్న ఆర్థిక మరియు రిజర్వేషన్ మొదలగు సంక్షేమ పథకాలు అ.క్ష.లకు అందవేమోననే అనుమానం లేకుండా తమ ఔన్నత్యాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నం చేయవలసినదిగా కోరుకుందాము. ప్రస్తుతము ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అగ్నికుల క్షత్రియ అను పేరు మీదనే ప్రభుత్వము కల్పించు సదుపాయములు అమలు జరుగుచున్నవి కనుక ఈ విషయంలో అనుమానము అవసరములేదు.


సంఘటితశక్తికి ఏ లోకంలోనూ తిరుగులేదు. ఆ శక్తి మనకు కావాలి.
ఒకే జాతి, ఒకే మూలముయొక్క మనము ఒకే గమ్యమువైపు నడుద్దాము.
గమనిక : ఈ కరపత్రాన్ని పదిమందితో చదివించే ప్రయత్నం చేయండి.
కరపత్రము-1


అగ్నికుల క్షత్రియ సోదర మహాశయులకు విజ్ఞప్తి
    మన జాతి నేడు దైవయోగము వలన తమ ప్రాచీన వైభవమును కోల్పోయి జీవకళ లేకుండా ఉన్నది. కొంతకాలము నుండి మన జాతి పూర్వచరిత్రను విస్మరించి ఉన్నది. మనకు ఎంతో గర్వింపదగిన చరిత్రము వుండి కూడ ఇంతవరకు చరిత్రలేని జాతివలె మన పూర్వ తేజస్సును మరచుట భావ్యము కాదు.
    గతాన్ని విస్మరించి సమాజంలో అణగారియుండి చిన్నచూపు చూడబడుచున్న అగ్నికుల క్షత్రియు (అ.క్ష.)ల మూలములు, వారి వారసత్వము, చారిత్రక నేపథ్యము, కులముయొక్క విశిష్ఠత ప్రతి అ..క్ష.తెలుసుకోవలిసి వుంది. అ.క్ష. ఏర్పడిన కాలము, ఏర్పడిన విధానము, వారి పూర్వపు ఔన్నత్యమును గురించి ప్రతివారు తెలుసుకోవాలి.
    వాస్తవము కల్పితముకంటే అద్భుతముగా ఉంటుంది.
    అగ్నికుల క్షత్రియ అనే కులము వంశపరంపరగా వచ్చిన కుల వౄత్తి ఆధారంగా ఏర్పడిన ప్రాచీన ఆదిమ కులాల్లో ఒక కులం కాదు. అది క్రీస్తుకు పూర్వము సుమారు 400 సంవత్సరముల క్రిందట కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో భారతదేశ రక్షణ నిమిత్తం ఏర్పరచబడిన కులము. ఆ కులము పేరును తమకు అర్హత లేని గొప్పతనాన్ని ఆపాదించుకొనుటకుగాను ఎవరో కొద్దిమంది ఏర్పరుచుకున్న పేరు కాదు. దానికి వైభవోపేతమైన గత చరిత్ర ఎంతో ఉంది. అటువంటి ఉన్నత విలువలు గల కులము యొక్క అస్తిత్వము నేడు ప్రశ్నార్థకమైనది. అ.క్ష.ల యొక్క పూర్వవైభవమును తెలియజేయు కొన్ని చారిత్రక సత్యములు ఈ క్రింద ఇవ్వబడినవి....


1. అగ్ని కుల క్షత్రియుల యొక్క పుట్టుక :-
    ప్రముఖ దేశీయ చారిత్రక పరిశోధకులైన శ్రీ కోట వెంకటాచలం గారు రచించిన `అగ్ని కుల క్షత్రియులు లేక బ్రహ్మక్షత్రులూ అను గ్రంథమునందు ఈ క్రింది విధముగా వ్రాశారు...
    `... ఆంధ్ర శాతవాహన వంశము అనేక భాగములై దేశములో అల్ప రాజ్యములు స్థాపించి ఎవరికి వారు స్వతంత్రులుగానుండిరి. వాయవ్య భారతదేశమున శక, హూణ, ఘార్జరాది విదేశీజాతులవారు అల్ప రాజ్యములకు ప్రభువులైయుండి అవకాశము దొరికినపుడెల్లను దేశమును కొల్లగొట్టుచు, స్త్రీ, బాల, వౄద్ధులను సైతము హింసించుచుండిరి. అల్ప రాజ్యములను ఏకం చేసి నాయకత్వం వహించి పరదేశీయుల దాడినుండి దేశమును రక్షించగల చక్రవర్తిత్వము లేకపోయినది. దేశము అరాచకముగనున్నట్లేర్పడెను. ఆ సమయంలో హిందూరాజులు పీఠాధిపులకు శిష్యులై ధర్మయుక్తముగా పాలించుచుండిరి. ఇట్టి స్థితిలో పీఠాధిపులు బ్రాహ్మణరాజ వంశములనుండి వీరులగు నాలుగు కుటుంబముల వారినేరి వారియందు బ్రహ్మతేజస్సును, క్షాత్రతేజస్సును నిలుచునట్లు సంకల్పించి వేద మంత్రములచే అగ్నినుపాసింపజేసి వారి చేత హోమాదులు చేయించి దేశమును నాలుగు భాగములుగానొనర్చి వారు నలుగురిని ఆయా భాగములకు అథినాధులుగానొనర్చిరి. ఈ నాలుగు వంశముల వారును అగ్ని కుల క్షత్రియులు అని పిలువబడిరి. అగ్నికులమనగా అగ్నిదేవుని వంశమునకు చెందినవారు. అగ్ని - దేవతలలో బ్రాహ్మణుడు. అగ్నికులమన బ్రాహ్మణ వర్ణము. బ్రాహ్మణ వర్ణమందు పుట్టి క్షాత్రమవలంబించిన వాడు అగ్ని కుల క్షత్రియుడు అని బ్రహ్మ క్షత్రుడు అని పిలవబడెను....' అని వ్రాశారు.
    మరొక ప్రముఖ దేశీయ చరిత్ర పరిశోధకులైన శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు పంతులు గారు రచించిన `చాళుక్యులు దాక్షిణాత్యులే' అను పరిశోధన వ్యాసమందు ఉత్తర దేశమునందలి సోళంకులు అగ్ని కుల క్షత్రియులని, సూర్య, చంద్ర వంశములే గాక అగ్నివంశమనునది కూడ కలదని వ్రాశారు. ఆయన `.... ఉత్తర దేశమునందలి చాళుక్యులు అనగా సోళంకులు తాము అగ్నికుల.క్షత్రియులమని  చెప్పుకొనసాగిరని, పవార్ (ప్రమార), పరిహారీ (ప్రతిహారీ), చౌహాన్ (చాహుమాన), సోళంకి (చాళుక్య) - ఈ నాలుగు క్షత్రియ జాతులను అ.క్ష.లని రాజపుత్ర స్థానమందనియెదరు...' అని కూడా వ్రాశారు.
    పై రెండు వ్యాసములను పరిశీలించినయెడల - మొదటి వ్యాసములో అగ్నికుల క్షత్రియ అను పేరు ఏర్పడిన విధము, ఏర్పడిన కాలము, దేశము నాలుగు చెరగులా అ.క్ష. రాజవంశములవారు పరిపాలించిన విషయము తెలియుచున్నది. రెండవ వ్యాసములో అగ్నికులము అనునది చాళుక్యులకు పూర్వకాలమునందే ఉన్నదనియు, ఉత్తర హిందూదేశము పాలించిన రాజులు కూడ అ.క్ష.లేనని నిర్ధారణమవుచున్నది.
    ఈ విధముగా చారిత్రక పరిశోధకులు అ.క్ష.లు ఏర్పడిన కాలము, ఏర్పడిన సందర్భమును గురించి ఏకాభిప్రాయము వెలిబుచ్చారు. అ.క్ష. కులము ఈ మధ్య కాలములో దేశ రక్షణ కొరకు ప్రత్యేకముగా ఏర్పరచబడిన కులము అనేది వాస్తవము.


2. నేటి అ..క్ష.లు ఆనాటి అ.క్ష.లైన పల్లవ వంశీకులా?
    `అవునూ అనేదే దీనికి సమాధానము.
    హోమాదుల ద్వారా బ్రహ్మ తేజస్సును, క్షాత్ర తేజస్సును నింపబడిన నలుగురు బ్రాహ్మణ రాజ వంశీకులు దేశము నాలుగు భాగములకు అధినాధులుగా చేయబడినారు కదా! ఆ నలుగురు తమతోజేరి తమ నాయకత్వము అంగీకరించిన సామంతరాజులతో కలసి దేశమునకు ఎట్టి బాధయూ కలగకుండా కాపాడగలిగారు. చాళుక్యులు, పల్లవులు, కదంబ, చేడ మొదలగు రాజవంశముల వారు ఆ విధముగా నియమింపబడినవారు. వారిలో పల్లవులు శాతవాహనులకు సామంతరాజులుగా ఉన్నారు. పల్లవులు బ్రాహ్మణులని చరిత్ర చెబుతున్నది. (పే. 52 ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర)
    ఆంధ్రమహాసామ్రాజ్యము అంతరించిన తర్వాత అప్పటి వరకు శాతవాహనులకు సామంత రాజులుగానుండిన పల్లవులు స్వతంత్రులై క్రీ.శ.200 నుండి క్రీ.శ.700 వరకు కౄష్ణానదికి దక్షిణాన ఉన్న ఆంధ్రదేశాన్ని కాంచీపురమును రాజధానిగా చేసుకొని పరిపాలించారు. వీరి పరిపాలన కాలంలో తూర్పుసముద్ర తీరమునుండి ఆంధ్రులు అత్యంత సాహసధైర్యములతో స్వదేశమును వదలి అతి దూరస్థలములగు జావా, సుమత్రా, మలయా ద్వీపములకును, బర్మా, సయాం, కాంబోడియా మొదలగు తూర్పుదేశములకు వాణిజ్య వాంఛతో వలసపోయి, ఆయా దేశములను జయించి వలస రాజ్యములను ఏర్పరుచుకొని ఆంధ్రదేశమునకే కాక యావద్భారతదేశానికి కూడ దిగంత, విశ్రాంత కీర్తిని సంపాదించియున్నారు. శాతవాహనుల కాలంలో నౌకాయానమునకు పల్లవులు అధిక ప్రాధాన్యతను ఇచ్చి అభివౄద్దీ పరిచారు. అప్పుడు ప్రారంభమైన నౌకా నిర్మాణము, దేశీయ విదేశీయ నౌకా యానము, నౌకా వాణిజ్యము ఆంధ్రదేశంలో పల్లవ వంశపాలన అంతరించిన తర్వాత ఈ మధ్యకాలం వరకు అ.క్ష.ల అధీనములోనే కొనసాగినది అనే విషయం జగద్విదితం.
    శాతవాహనులు బౌద్ధమతమును స్వీకరించి ఆ మతమును పోషించి అభివౄద్ధి పరచగా వారికి సామంతులుగా ఉన్న పల్లవులు మాత్రము బ్రాహ్మణ మతాభిమానులై హిందూమతాభివౄద్ధికి కౄషిచేశారు. ఆ సందర్భంలో హిందుదేవాలయ నిర్మాణ వ్యవస్థ ప్రారంభమైనది. అప్పటివరకు వేదసంస్కౄతిలో విగ్రహారాధన లేదు. దేవాలయ వ్యవస్థ లేదు. దేవాలయ వ్యవస్థకు ఆద్యులు పల్లవులే. అటువంటి హిందూదేవాలయ వ్యవస్థ ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో అ.క్ష.ల ఆధీనంలోనే వారే పూజారులుగా కూడ నడుస్తూ ఉంది. నెల్లూరు, గూడూరులలోని ద్రౌపది, ధర్మరాజు దేవాలయాలు ఇందుకు ఉదాహరణ. ఇటీవల అనగా 28-4-2009 న మతమార్పిడుల నిరోధానికి దేశవ్యాప్త శోభాయాత్రలు తలపెట్టిన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ హిందూ దేవాలయ వ్యవస్థకు కులాలతోగల సంబంధమును గురించి వివరించుతూ `...ఆలయాలు నిర్మాణం చేసే పని అగ్నికుల క్షత్రియులదీ అని చెప్పారు. (ఆంధ్రజ్యోతి 29-4-2009). కీ.శే. సత్యలింగం నాయకర్, కీ.శే. కొపనాతి కౄష్ణమ్మగారు, పినపోతు గజేంద్రుడుగారు, కీ.శే. పెదసింగు స్వామి గారు మొదలగు అ.క్ష.లు ఆలయనిర్మాణం చేయడంకాని, ధ్వజస్థంభములెత్తడంగాని చేసిన ప్రముఖులలో కొందరు. ఈ విధముగా పల్లవుల కాలంలో ప్రారంభింపబడి వారి ఆధ్వర్యంలో ఎంతో వైభవైశ్వర్యములతో కొనసాగిన దేశీయ విదేశీయ నౌకాయానము ఈ మధ్య కాలం వరకు అ.క్ష.ల అధీనంలోనే కొనసాగియుండడము, అప్పటి దేవాలయ వ్యవస్థ కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ అ.క్ష.ల అధీనంలోనె కొనసాగుచుండడం గమనించితే నేటి అ.క్ష.లు పల్లవ వంశీకులమని చెప్పుకోవడానికి సందేహింపనవసరంలేదు.